Tue 5th March, 2019
Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
అర్హతనిచ్చే నెట్లు అవకాశాల మెట్లు!
* సైన్స్ విద్యార్థులకు సీఎస్ఐఆర్-నెట్
బోధనలో అత్యున్నత ప్రమాణాలను పాటించడానికి నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. పరిశోధనల దిశగా కెరియర్ను నడిపించాలన్నా.. అధ్యాపక వృత్తిని అందుకోవాలన్నా.. ఇందులో అర్హత సాధించాలి. సైన్స్ విద్యార్థులకు సీఎస్ఐఆర్, ఇతర విభాగాల అభ్యర్థులకు యూజీసీ తరఫున ఎన్టీఏ ఈ పరీక్షలను జరుపుతున్నాయి. ఉన్నత విద్యకూ ఈ అర్హత ఉపయోగపడుతుంది.
దేశవ్యాప్తంగా సైన్స్ సంబంధిత విభాగాల్లో జేఆర్ఎఫ్ పొందేందుకూ, లెక్చరర్షిప్ అర్హతకూ నిర్వహించే పరీక్ష... సీఎస్ఐఆర్- యూజీసీ నెట్. ఈ జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ప్రకటన విడుదలైంది. సైన్సెస్లో పీజీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. విస్తృతమైన సిలబస్లో ముఖ్యమైన అంశాలపై దృష్టిపెట్టినా విజయం సాధ్యమే. అందుకే డిగ్రీ, పీజీలో సగటుస్థాయి మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా శ్రద్ధగా కష్టపడితే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, మంచి భవితను పొందవచ్చు.
జేఆర్ఎఫ్ అర్హత పొందినవారు సీఎస్ఐఆర్ పరిధిలో ఉన్న ప్రయోగశాలలోకానీ, సుప్రసిద్ధ యూనివర్సిటీలోకానీ పీహెచ్డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్షిప్ అర్హత పొందినవారు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో యూజీసీ గుర్తింపు పొందిన అధ్యాపకులుగా బోధించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే జనరల్ డిగ్రీ లెక్చరర్ పోస్టులకూ, గురుకుల డిగ్రీ లెక్చరర్ల పోస్టులకూ వీరు అర్హులు.
ఎంఎస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో 55% మార్కులతో ఉత్తీర్ణులైన జనరల్, ఓబీసీ విద్యార్థులు, 55% మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో తుది సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.
జేఆర్ఎఫ్కు అర్హత సాధించటానికి జనరల్ కేటగిరీ విద్యార్థులకు గరిష్ఠ వయః పరిమితి 28 సంవత్సరాలు. ఎస్సి, ఎస్టీ, పీహెచ్, మహిళా విద్యార్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంది. నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ విద్యార్థులకు మూడేళ్ల సడలింపు ఉంది. లెక్చరర్షిప్కు గరిష్ఠ వయఃపరిమితి లేదు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను 27 కేంద్రాల్లో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, హైదరాబాద్లలో నిర్వహిస్తారు. జేఆర్ఎఫ్ అర్హత రెండు సంవత్సరాల వరకూ చెల్లుబాటవుతుంది. ఈ కాల వ్యవధిలో మాత్రమే ఏదైనా పరిశోధన సంస్థలో/ యూనివర్సిటీలో ప్రవేశం పొందాలి.
దరఖాస్తు చివరి తేదీ: మార్చి 18, 2019.
పరీక్ష తేదీ: జూన్ 16, 2019,www.csirhrdg.res.in
సీఎస్ఐఆర్ నెట్ సిలబస్ సన్నద్ధత ఆధారంగా ఇతర పోటీ పరీక్షలైన ఐఐఎస్సీ, జేఈఈ, బార్క్, హెచ్సీయూ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఎఫ్సీఐ, ఏపీ సెట్, టీఎస్ సెట్, డీఎల్, పేటెంట్ ఆఫీసర్, జెన్కో, డీఆర్డీఓ, యూపీఎస్సీ, జెస్ట్లలోనూ మంచి ఫలితాలు సాధించవచ్చు.
ఈ టాపిక్లు ముఖ్యం
లైఫ్ సైన్సెస్: ఎంఎస్సీ- బోటనీ, జువాలజీ చేసి లైఫ్సైన్స్ రాసేవారు ఆధునిక బయాలజీ (మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, బయోకెమికల్ టెక్నిక్స్, బయో ఫిజిక్స్, స్పెక్ట్రోస్కోపి) పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. ఆధునిక బయాలజీలో పీజీ చేసినవారు తమ ఆప్షనల్తోపాటు క్లాసికల్ బయాలజీపైనా దృష్టిసారించాలి. ఇకాలజీ, ఇవల్యూషన్, బయో డైవర్సిటీ మొదలైనవి ఎక్కువగా చూసుకోవాలి.
కెమికల్ సైన్సెస్: ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీలో ఎస్మెట్రిక్ సింథసిస్, కన్ఫర్మేషనల్ అనాలిసిస్, ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపి, రియోజెంట్స్, పెరిసైక్లిక్ చర్యలు, కాంతి రసాయన శాస్త్రం తదితర అంశాలను చూసుకోవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో సంశ్లిష్ట సమ్మేళనాలు, అనలిటికల్ కెమిస్ట్రీ, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, కర్బన లోహ సమ్మేళనాలు, మెటల్ క్లస్టర్స్, ఫిజికల్ కెమిస్ట్రీలో క్వాంటమ్ కెమిస్ట్రీ, సాలిడ్స్టేట్, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపి, స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్, కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ మొదలైన అంశాలు ముఖ్యం.
ఫిజికల్ సైన్సెస్: మోడరన్ ఫిజిక్స్, న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్, హీట్, థర్మోడైనమిక్స్ (క్లాసికల్, స్టాటిస్టికల్), ఎలక్ట్రోమాగ్నటిక్ థియరీ, ఎలక్ట్రానిక్ అండ్ ఎక్స్పరిమెంటల్ మెథడ్స్, ఆప్టిక్స్, మెకానిక్స్ సబ్జెక్టులను విపులంగా చదవాలి.
మేథమేటికల్ సైన్సెస్: స్టాటిస్టిక్స్, ఎక్స్పోలేటరీ డాటా అనాలిసిస్, కాంప్లెక్స్, డిఫరెన్షియల్ అనాలిసిస్, మ్యాట్రిక్స్, డెరివేటివ్స్, వెక్టర్, త్రికోణమితి, జామెట్రీ పాఠ్యాంశాలను క్షుణ్ణంగా చదవాలి.
ఎలా సన్నద్ధం కావాలి?
కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్, ప్లానిటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మేథమేటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ విభాగాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
పీజీలోని మొత్తం సిలబస్ను ఈ పరీక్ష కోసం చదవనక్కర్లేదు. పార్ట్-సిలోని ప్రశ్నలకు చాయిస్ ఉండటమే దీనికి కారణం. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ఈ పరీక్షకు గరిష్ఠంగా 200 మార్కులు, పరీక్ష సమయం 3 గంటలు.
పార్ట్-ఎ: అందరికీ ఒకేవిధంగా ఉంటుంది. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్తో కూడిన లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్ మొదలైన వాటికి సంబంధించిన 20 ప్రశ్నలు ఇస్తారు. దీనిలో ఏవైనా 15 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు. మొత్తంగా ఈ విభాగానికి 30 మార్కులు కేటాయించారు.
పార్ట్-బి: అభ్యర్థుల సంబంధిత సబ్జెక్టులో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. 20 నుంచి 35 వరకూ ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 మార్కుల్లో పార్ట్-బికు 70 మార్కులు కేటాయించారు. దీనిలో బేసిక్ కాన్సెప్టులు, డిగ్రీ సిలబస్ నుంచి కూడా కొన్ని ప్రశ్నలను అడుగుతున్నారు. కాబట్టి, సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ సిలబస్ను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
పార్ట్-సి: దీనిలో సైంటిఫిక్ కాన్సెప్టుల్లో పరిజ్ఞానం, అనువర్తిత ధోరణి మొదలైన అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఇవన్నీ అభ్యర్థుల విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి. ఈ విభాగానికి 100 మార్కులు కేటాయించారు. ముఖ్యంగా సంబంధిత సబ్జెక్టులో పీజీ సిలబస్ను ప్రాక్టికల్ ధోరణిలో చదవాలి. ఈ విభాగంలో అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి, పీజీ సిలబస్లో కొన్ని ముఖ్యమైన 10- 15 అంశాలపై దృష్టిసారిస్తే చాలు.
ఈ విభాగ ప్రశ్నలకు ఎక్కువ వెయిటేజీ ఉంది. కాబట్టి, సంబంధిత సిలబస్ను ప్రామాణిక రిఫరెన్స్ పుస్తకాలు, రిసెర్చ్ జర్నల్స్ను ఆచరణ దృష్టితో అధ్యయనం చేయాలి. రుణాత్మక మార్కులుంటాయి. కాబట్టి, తెలిసిన ప్రశ్నలకే సమాధానాలు గుర్తించాలి.
ఇతర అభ్యర్థులకు యూజీసీ-నెట్
ఎన్టీఏ నిర్వహించే యూజీసీ నెట్లో అర్హత సాధిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దేశంలో ఎక్కడ ప్రకటన వెలువడినా దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు (మహారత్న, నవరత్న కంపెనీలు) నెట్ స్కోర్తో మేనేజ్మెంట్ ట్రెయినీ హోదాతో లీగల్, హ్యూమన్ రిసోర్సెస్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు అందిస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు సైతం నెట్ అర్హులకు ఎంపికలో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి.జేఆర్ఎఫ్ అర్హత సాధించినవారు పరిశోధనల్లో భాగం పంచుకోవచ్చు.
సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులైతే 50 శాతం మార్కులు. ప్రస్తుతం పీజీ కోర్సులు చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
జూన్ 1 నాటికి జేఆర్ఎఫ్ దరఖాస్తుదారులకు 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, మహిళలకు గరిష్ఠ వయసులో అయిదేళ్ల సడలింపులు వర్తిస్థాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ దరఖాస్తులకు వయః పరిమితి వర్తించదు.
తాజా మార్పులేమిటి?
యూజీసీ నెట్కు గతంలో పేపర్ -1, పేపర్-2 మధ్య 30 నిమిషాల విరామం ఉండేది. జూన్లో నిర్వహించబోయే పరీక్షకు ఈ విరామం ఉండదు. మూడు గంటల వ్యవధిలో పరీక్ష పూర్తవుతుంది. ఇందులో పేపర్-1 ఒక గంట. పేపర్ 2 రెండు గంటల సమయం ఉంటాయి.
సిలబస్లో స్వల్ప మార్పులు చేశారు. ఆయా సబ్జెక్టుల్లో ఆధునిక అంశాలను కొత్తగా చేర్చారు. ప్రతి సబ్జెక్టును పది అధ్యాయాలుగా విభజించారు. మారిన సిలబస్ ప్రకారం తొలిసారిగా పరీక్ష నిర్వహించనున్నారు.
సబ్జెక్టులవారీ కొత్త సిలబస్ వివరాలు https://www.ugcnetonline.in/syllabus-new.php నుంచి పొందవచ్చు.
పరీక్ష స్వరూపం
ఆన్లైన్లో నిర్వహిస్తారు. పేపర్-1 వంద మార్కులకు, రెండో పేపర్ 200 మార్కులకు ఉంటాయి. పేపర్-1 అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది. మొత్తం 50 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. పేపర్ -2 అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ఉంటుంది. మొత్తం వంద ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు.
పేపర్ -1: ఇందులో ఆప్టిట్యూడ్, కాంప్రహెన్షన్ తదితర 10 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి విభాగం నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. పేపర్-1కు సంబంధించి టాటా మెక్గ్రాహిల్స్తోపాటు పలు పబ్లిషర్ల పుస్తకాలు మార్కెట్లో లభిస్తున్నాయి. నిపుణుల సాయంతో వీటిలో ఒక పుస్తకాన్ని ఎంచుకుని చదవాలి. గత అయిదేళ్ల పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి.
పేపర్-2: మొత్తం సబ్జెక్టు ప్రశ్నలే ఉంటాయి. సంబంధిత సబ్జెక్టులో ప్రాథమికాంశాలు, అనువర్తనం, విశ్లేషణ, అవగాహన, జ్ఞానం పరిశీలించేలా ఈ ప్రశ్నలు వస్తాయి. కాన్సెప్టులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. సిలబస్కు అనుగుణంగా సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ పుస్తకాలను చదవాలి.
యూజీసీ నెట్ సిలబస్ సబ్జెక్టుల్లో ఆధునిక అంశాలను కొత్తగా చేర్చారు. ప్రతి సబ్జెక్టును పది అధ్యాయాలుగా విభజించారు.
ముఖ్యమైన తేదీలు
రిజిస్ట్రేషన్: మార్చి 1 నుంచి 30 వరకు
ఆన్లైన్ దరఖాస్తులో సవరణలు: ఏప్రిల్ 7 నుంచి 14 వరకు.
ప్రవేశ పత్రాలు: మే 15 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీలు: జూన్ 20, 21, 24, 25, 26, 27, 28
పరీక్ష వ్యవధి: 3 గంటలు. పేపర్ -1, పేపర్ -2 మధ్య ఎలాంటి విరామం ఉండదు. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు ఉంటాయి. ఉదయం 9:30 నుంచి 12: 30 వరకు; మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు
ఫలితాలు: జులై 15
పరీక్ష కేంద్రాలు:ఆంధ్రప్రదేశ్లో..అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నరసారావుపేట, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, టెక్కలి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
* తెలంగాణలో... హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్.
వెబ్సైట్: https://ntanet.nic.in
ఎస్. కిరణ్కుమార్, డైరెక్టర్, కెమ్బయోసిస్